జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

లీడ్స్ న్యూస్,జనగామ:విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ముందస్తుగా సన్నద్ధమై ఓ ప్రణాళికతో తరగతి గదిలోకి వెళ్ళాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మంగళవారం జిల్లాలోని దేవరుప్పుల మండల పరిధిలో గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా 8వ,10వ తరగతి గదులను సందర్శించి,ఉపాధ్యాయుల బోధన విధానాన్ని,విద్యార్థుల అభ్యాసన స్థాయిని పరిశీలించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. క్లిష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠ్యాంశాలను కేవలం చదివించడం కాకుండా,విద్యార్థులతో పదేపదే సాధన చేయించడం ద్వారా వారి సామర్థ్యాలను పెంపొందించాలని తెలిపారు. అకాడమిక్ ఫ్రేమ్ వర్క్ను తప్పనిసరిగా పాటించాలని, అనంతరం విద్యార్థులకు అందించే యూనిఫామ్ తయారీ చేసే కుట్టు మిషన్ కేంద్రాన్ని అయన సందర్శించి దుస్తులు సకాలంలో అందించేలా సంబంధిత అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
