నిమ్మరసం ఇచ్చిన డిసిసి అధ్యక్షురాలు ధనవంతి

జనగామ టౌన్,ఆగస్టు 22,(లీడ్స్ న్యూస్):
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనగామ డీసీసీ కార్యాలయంలో జనగామకు చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచ రాములు గత 48 గంటలుగా చేపట్టిన నిరాహార దీక్షను శనివారం డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి నిమ్మ రసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ధనవంతి, కంచె రాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు తావు లేదని, పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బంది పెట్టడం సరికాదని,కార్యకర్తల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన పార్టీని బలోపేతం చేయడమే మన లక్ష్యం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి టెంపుల్ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేముల్ల సత్యనారాయణ రెడ్డి, జాయ మల్లేష్ జనగామ మండల,పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.