జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): జిల్లాలో భారీగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 160 మంది కార్యదర్శులు ఈ బదిలీల్లో స్థానచలనం పొందారు. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 221 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఇందులో 160 మంది కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లుగా ఒకే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్యదర్శులందరిని బదిలీ చేశారు. అయితే, ఇంతకుముందున్న నియోజకవర్గాల్లో కాకుండా వేరే నియోజకవర్గానికి వీరందరినీ బదిలీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి, ఆయా మండలాల ఎంపీడీవోలు బదిలీ అయిన కార్యదర్శులను తక్షణమే రిలీవ్ చేయాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమవారం నాటికి బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులందరు కొత్త జీపిల్లో విధుల్లో చేరనున్నారు. ఇంత పెద్ద ఎత్తున పంచాయతీ కార్యదర్శులు బదిలీ కావడం జిల్లా ఏర్పడిన నాటునుండి ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
