విద్యార్థులు కష్టపడి చదవాలని సూచన

జనగామ,లీడ్స్ న్యూస్: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తరిగొప్పుల మండల కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్,గణితంపై గంటపాటు పాఠాలు బోధించారు. శనివారం ఆయన ఆ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసి పాఠాలు బోధించారు. గణితంలో మెలకువలు నేర్పారు, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడేందుకు ఆయన పలు సూచనలు చేశారు. గణితంపై పట్టు సాధిస్తే భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి 15 రోజులకు మాక్ టెస్టులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆహార నాణ్యతలో రాజీ లేదని పాలల్లో నీళ్లు కలిపినా, ఆహారంలో నాణ్యత లోపించినా ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడి, క్రమశిక్షణతో చదువి జీవిత లక్ష్యాలను సాధించాలని, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న విద్యా అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
