teluguleads.in
Newspaper Banner
Date : 25 March 2026, 9:25 pm Posted By : TELUGU LEADS

పెట్రోల్, డీజిల్ కొరతలేదు

వదంతులు నమ్మకండి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత లేదని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన శాసనసభ ప్రాంగణం వద్ద పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్,డీజిల్, ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంధన వనరులతో పాటు ఎల్.పి.జి కొరత అంటూ వస్తున్న వదంతులతో ప్రజలు గందరగోళంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. రానున్న మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్,భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ నీ మించి సరఫరా కొనసాగుతోందని,ఈ రోజు 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. అంటే 652 కిలో లీటర్ల అదనపు నిల్వ మిగిలిందన్నారు. దీనికి తోడు అదనంగా 16,000  కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. కొన్ని పెట్రోలు బంక్ లకు నిర్ణిత సమయానికి ట్యాంకర్లు చెరుకోక పోవడంతో ఆయా బంక్ లలో నో-స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు. అదే సమయంలో షికార్లు చేస్తున్న పుకార్లను నమ్మి వినియోగదారులు కంటైనర్లలో,డబ్బాలలో పెట్రోల్,డీజిల్ ని తీసుకెళ్లడం పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని అంతకుమించి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. పెట్రోలియం నిలువలు రానున్న 65 రోజులకు సరిపడా ఉన్నాయని,సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేలా నిరంతరం కొనసాగేందుకు వీలుగా O.G.C లైన్ ను విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర రాజధానిలో 596 పెట్రోల్ బంక్ లు నిరంతరాయంగా పని చేస్తున్నాయని  హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడ కుడా కొరత లేదని,అహ్మదాబాద్,సూరత్,బెంగుళూరు, ధారవాడ ,బెల్గాం వంటి నగరాలలో కూడ ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యాయన్నారు.అలాగే ఎల్.పి.జి విషయంలో ఎటువంటి కొరత లేదని,కాకపోతే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంతమేర సమస్య ఉన్నట్లు గుర్తించమన్నారు.