
వరంగల్ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ ఒక డ్రైవర్ అందరూ చూస్తుండగానే ఒంటికి నిప్పంటించుకోవడం కలకలం రేపింది. తమ డిమాండ్ల సాధన కోసం డిపో గేటు ముందు భారీ ధర్నా చేపట్టారు. నిరసన హోరెత్తుతున్న సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక డ్రైవర్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో తోటి కార్మికులు వెంటనే అప్రమత్తమైన మంటలను ఆర్పివేసి,బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను నిలువరిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.