కరీంనగర్ ప్రతినిధి, లీడ్స్ న్యూస్: వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసకు రైతుల నుండి నిరసన సెగ ఎదురైంది. శుక్రవారం రాత్రి చందుర్తి మండలం మల్యాల గ్రామంలో సాగు నీరు సరిగ్గా సరఫరా కావడం లేదని మండలానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సాగు నీరు సరఫరా లేక వరి,ఆకు కూరలు,కూరగాయ తదితర పంటలు ఎండి పోతున్నాయని వారు అన్నారు. సమస్య పరిష్కరించాకే ఇక్కడి నుండి వెళ్లాలని, సాగునీటిని ఇవ్వకుండా, రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందని వారు విప్ ను నిలదీశారు. సమాధానం చెప్పలేక అక్కడి నుండి వెళ్లి పోయారు.
