జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

లీడ్స్, జనగామ ప్రతినిధి : రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక,అరైవ్ – అలైవ్, రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామ పంచాయతీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం,మద్యం సేవించి వాహనాలు నడపడం,మొబైల్ ఫోన్ వినియోగం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. హెల్మెట్,సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ఐఎస్ఐ ధృవీకరించిన హెల్మెట్ లను మాత్రమే కొనుగోలు చేసి వాడాలని తద్వారా తలకు రక్షణ కల్పించి,ప్రాణ నష్టం తగ్గించవచ్చని సూచించారు. పాదచారులు కూడా జాగ్రత్తగా రోడ్లు దాటాలని, నిర్దేశిత జీబ్రా క్రాసింగ్లను వినియోగించాలని చెప్పారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు అరైవ్ – అలైవ్ కార్యక్రమ వారోత్సవాలు జరుగుతాయని, జిల్లాలోని 280 గ్రామ పంచాయతీల్లో రోడ్డు భద్రత గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి,సమావేశాలను చేపడుతున్నామని అన్నారు. అదే విధంగా ప్రజల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించడం,ట్రాఫిక్ నిబంధనల పట్ల బాధ్యతాయుత ప్రవర్తనను అలవరచడం,రోడ్డు ప్రమాదాలను తగ్గించి,ప్రాణ నష్టాన్ని నివారించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. అదే విధంగా నేషనల్ హైవేస్ యాదాద్రి – వరంగల్ ఎన్. హెచ్ – 163 అధ్వర్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన నూతన అంబులెన్స్ను కలెక్టర్, డీసీపీలు జెండా ఊపి ప్రారంబించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో గోల్డెన్ ఆవర్లో అందించే వైద్య సేవలు ప్రాణాలను కాపాడుతాయని వీటిలో అంబులెన్స్ పాత్ర ముఖ్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.హెచ్.ఏఐ పీడీ భరద్వాజ్,జనగామ ఆర్టీవో శ్రీనివాస్ గౌడ్,ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


