హైదరాబాద్, లీడ్స్ న్యూస్ :
కాంగ్రెస్ పార్టీ అధినేత,పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్,రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను నిన్న సాయంత్రం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వాతావరణ మార్పుల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పాటు ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ వెంట ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ప్రత్యేక వైద్య బృందం సోనియా ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆమెకు వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని, ఆందోళన చెందాల్సినంత తీవ్రమైన సమస్య ఏమీ లేదని సమాచారం.
