జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ ప్రతినిధి, లీడ్స్ న్యూస్: ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) ప్రకారం రోడ్డు భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ లతో కలిసి ఆయన రహదారి భద్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ హైవే పై ఐఆర్సీ నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అలాగే అనుమతి లేని హోర్డింగ్ లు ఉండకూడదన్నారు. జనగామ పట్టణంలో
రోడ్ లకు ఇరువైపులా ఎలాంటి అమ్మకాలు జరగకుండా,ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా, సమీకృత వెజ్,నాన్ వెజ్ మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేసి, అందులో అమ్మకాలు నిర్వహించుకు నేలా చూడాలని ఆదేశించారు. ఘనపూర్ (స్టేషన్) జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని అన్నీ పాఠశాలల వద్ద వేగ నియంత్రికలను తనిఖీ చేయాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులచే రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని చెప్పారు.
ఈ సమావేశంలో ఆర్డివోలు గోపీరాం,వెంకన్న, ఆర్&బీ ఈఈ స్వరూప,ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్,ఎక్సైజ్ అధికారి అనిత,ఈఈ పీఆర్ శ్రీనివాస రావు,ఆర్టీఏ మెంబర్ అభి గౌడ్, జనగామ, ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్ లు మహేశ్వర్ రెడ్డి,రాధ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.