జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ లీడ్స్: రక్తదానం చేసి మానవత్వాన్ని చాటలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్ ఆధ్వర్యంలో మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సహకారంతో చంపక్ హిల్స్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం అత్యంత మహత్తరమైన సేవ అని,అవసరమైన వారికి సమయానికి రక్తం అందించడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో వైద్య విద్యార్థులు,సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు,జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం,జీఎంసీ ప్రిన్సిపల్ డా.నాగమణి, ఆర్ఎంఓ డా.కోటాచలం, వైద్యులు,విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మాత శిశు ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులు రోగులకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య సేవలపై రోగులతో మాట్లాడారు.

