సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి

జనగామ,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నియంతృత్వ వైఖరులకు పాల్పడాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి విజ్ఞప్తి చేశారు. జనగామ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజల వాహనాలను గేట్ బయటే ఆపి లోపటికి నడిచి రావాలని ఆదేశాలు జారీ చేయడాన్ని తాము ప్రశ్నించడం తప్పా? అని ఆయన అన్నారు. అలాగే జిల్లాలో ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్న ప్రజల అవసరాల కోసం ఇసుక,మట్టి తరలింపులో ఆంక్షలు విధించడం ఏంటని? వారన్నారు. ఈ ఆంక్షల కారణంగా ట్రాక్టర్, జేసిపి యజమానులు, వీటిమీదే ఆధారపడి పని చేస్తున్న కార్మికులు,డ్రైవర్లు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారని కలెక్టర్ ను అడగడం తాము చేసిన నేరమా? అని అన్నారు. ప్రజల సమస్యలను తాము అడిగినందుకు మీరు నన్ను ప్రశ్నిస్తారా…? అనే భావనతో కలెక్టర్ తమపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రిప్రజెంటేషన్ లు ఇచ్చేందుకు వెళితే సమయం ఇవ్వకుండా, వినతులు స్వీకరించకుండా అవహేళన చేస్తూ మాట్లాడిన తీరు సరి కాదన్నారు. అంతే కాదు, తమపై కలెక్టర్ కేసులు పెడతాం అని బెదిరింపులకు పాల్పడుతున్నాడని, సిపిఎం పార్టీకి, కమ్యూనిస్టులకు కేసులు,జైళ్లు,కొత్తేమీ కాదన్నారు. జిల్లా పరిపాలన అధికారిగా ఉండి రాజకీయ నాయకుడి మాదిరిగా బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరైంది కాదన్నారు. జనగామ పట్టణంలోని మల్లన్న గుడి వద్ద సర్వే నెంబర్ 401లో 20 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అల్లాడి మోహన్ రావు,అల్లాడి ఈశ్వరరావు,నిమ్మతి శ్రీనివాస రెడ్డి భూముల మధ్య సర్వే నెంబర్లలో బార్డర్ సమస్య ఉందని,ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరక ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అయన చెప్పారు. ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ క్రమంలో సీపీయం నాయకుడు బూడిది గోపిని వ్యక్తిగతంగా బదనం చేయడం కోసం ఈ భూమిలో ప్లాట్లు కొనుగోలు చేసిన ఒక్కొక్కరి నుండి రూ. 20 వేలు బూడిద గోపి వసూలు చేశారని ఓ వ్యక్తి చేత తప్పుడు ఫిర్యాదు చేపించి జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే కలెక్టర్ పత్రికా ప్రకటన చేయించడం సరైన కాదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి,జోగు ప్రకాష్, సుంచు విజేందర్, భూక్యా చందు నాయక్, పల్లెర్ల లలిత తదితరులు పాల్గొన్నారు.
